Film Industry : సినీ పరిశ్రమను వెంటాడుతున్న వరుస విషాదాలు..!
Film Industry : సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణం మరువక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఆమె నవంబర్ 17న పంజాబీ లోని లూథియానాలో తుది శ్వాస విడిచారు. 1976 లో మొదటిసారిగా వెండి తెరకు దల్జీత్ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఆ తర్వాత పుట్ జట్టన్ దే, కీ బాను దునియా దా, సర్పంచ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దల్జీత్ కౌర్.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. పూణే ఫిల్మ్ ఇన్ స్టి్ట్యూట్ లో చేరారు. తన భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత చాలా కాలం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. 2001 లో మళ్లీ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు దల్జీత్. పంజాబీ చిత్రం సింగ్ వర్సెస్ కౌర్ లో గిప్పీ గ్రేవాల్ తల్లిగా నటించారు. పంజాబ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ దాదాపు 70 పంజాబీ చిత్రాల్లో, 10 కి పైగా హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు.
ఈ మేరకు దల్జీత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని తెలుగు ప్రేక్షకులు ఇంకా జీర్ణించు కోలేకపోతున్నారు. కాగా ఇటీవలే కృష్ణ సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.