లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ జోనల్ డీసీపీలు, అదనపు డీసీపీ లు, ఏసిపి లు మరియు ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికలను పకద్భడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు. సైబరాబాద్ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం ముఖ్యంగా ఉచితాలను పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు.
ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు మరియు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మరియు అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యల పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక ప్రాంతాలను విధిగా పర్యటిస్తూ అట్టి ప్రాంతాలపై దృష్టిసారించాలని తెలిపారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయల్ డేవీస్, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ డా. జి. వినీత్, ఐపీఎస్., మేడ్చల్ డీసీపీ నితికా పంత్, ఐపీఎస్., శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, ఐపీఎస్., బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, ఐపీఎస్., రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఐపీఎస్., డీసీపీ EOW కె. ప్రసాద్, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి, ఎస్బి డీసీపీ సాయిశ్రీ, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్., మేడ్చల్ ఎస్ఓటీ డీసీపీ డి. శ్రీనివాస్, ఏడీసీపీలు, ఏసీపీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.