IPL-2024 Cricket Tournament : క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు : కమీషనర్ తరుణ్ జోషి ఐపిఎస్
ఐపిఎల్-2024 క్రికెట్ పోటీల నిర్వహణకు పటిష్టమైన భద్రతా - మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న 2024 IPL క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపిఎస్ నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో డీసీపీలు, ఏసిపిలు మరియు సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు మాట్లాడుతూ... రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడంలో తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణ బృందానికి సూచించారు.
ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.
ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ ట్రాఫిక్ మనోహర్, sot addl డీసీపీ నరసింహ రెడ్డి, ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఏసిపి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.