Gulf News : గల్ప్ మృతులకు రూ.5 లక్షల ప్రభుత్వ సహాయం మంజూరు
గత డిసెంబర్ నెలలో సౌదీ అరేబియాలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొడ్డు బాబు (బావుసాయిపేట), అరిగల శశికుమార్ (మరిపల్లి) రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మృతధన సహాయం (ఎక్స్ గ్రేషియా) మంజూరు చేస్తూ 15 మార్చి రోజున ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంగ్రేస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం ఏ. రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డికి, ప్రభుత్వ యంత్రాంగానికి టిపిసిసి గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమగ్ర ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు.