For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పిల్లల బాల్యాన్ని చిదిమేసే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

09:54 PM Jan 03, 2025 IST | Sowmya
Updated At - 09:54 PM Jan 03, 2025 IST
పిల్లల బాల్యాన్ని చిదిమేసే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు   సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
Advertisement

సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ రోజు నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ పదకొండవ సమన్వయ సమావేశం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు మాట్లాడుతూ... సమాజంలో బాలకార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతోమంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధానంగా తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదరికం మూలంగా వెట్టిచాకిరీ కోరల్లో చిక్కుకునే పిల్లలు కొన్నిసార్లు బాల నేరస్తులుగా మారే ప్రమాదం ఉందని, సంఘ విద్రోహక శక్తులు చిన్న పిల్లలను నేరాలకు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టి చాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

Advertisement GKSC

రాచకొండ పరిధిలో మానవ అక్రమ రవాణా మరియు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా మీద ఉక్కు పాదం మోపుతున్నామని, ప్రత్యేక బృందాల ద్వారా ఎంతో మందిని రక్షించామని, కేసులు నమోదు చేశామని తెలిపారు. ఒడిషా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టి కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకూడదు అని వారి నివాస ప్రాంతం లోనే వర్క్ సైట్ పాఠశాలలను నడుపుతున్న విషయం గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, యాదాద్రి సిడబ్ల్యుసి చైర్ పర్సన్ జయశ్రీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ప్రసాద్, బచ్ పన్ బచావో ఆందోళన్ ప్రతినిధి వెంకటేశ్వర్లు మరియు ఇతర రాచకొండ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image