Cm Jagan : ఆరోగ్య శ్రీ కార్డుదారులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!
Cm Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ కార్డు దారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిధి లోకి నూతనంగా మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పెంచిన చికిత్సలతో ఆరోగ్య శ్రీ పథకం కింద 3,255 చికిత్సలను అందిస్తున్నట్లు సీఎం వివరించారు. గత ప్రభుత్వంలో పోలిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అదనంగా 2,196 వైద్య చికిత్సలను ఆరోగ్య శ్రీ లోకి చేర్చినట్లు తెలిపారు.
ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో సీఎం జగన్ నూతన చికిత్సలను ఆరోగ్య శ్రీ పథకం కింద అమలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అలానే సీఎం జగన్ మాట్లాడుతూ... ఆరోగ్య శ్రీ పథకం అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కింద కేవలం 1059 చికిత్సలు అందించగా... తమ ప్రభుత్వంలో వాటిని 3,255 కు పెంచినట్లు తెలిపారు. 2019 మే నాటికి ఆరోగ్య శ్రీ వైద్య చికిత్సల సంఖ్య 1059 ఉండగా... 2020 జనవరిలో 2059 కి పెంచామన్నారు. 1000 రూపాయలు పైగా ఖర్చయ్యే ప్రతి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. 2020 జులై లో 2200 వైద్య సేవలు, 2020 నవంబర్ లో 2436, 2021 జూన్ లో 2446 చికిత్సలు అందించినట్లు తెలిపారు.
అదేవిధంగా 2022 లో 3255 వైద్య చికిత్సలకు ఆరోగ్య శ్రీ లో అందుబాటు లోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత టీడీపీ హయాంలో 2018–19 నాటికి ఆరోగ్యశ్రీ, 104, 108 పై పెట్టిన ఖర్చు మొత్తంగా రూ.1299.01 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆరోగ్య శ్రీ లో పెంచిన వైద్య చికిత్సల కారణంగా ఏడాది కయ్యే ఖర్చు రూ.2894.87 కోట్లుగా ఉందని సీఎం జగన్ వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కన్నా మూడు రెట్లు అధికంగా వైసీపీ హయాంలో ఖర్చు చేసి ప్రజలకు మేలైన ఆరోగ్యం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు.

