For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆ ఇంట్లో ఆరోజు నుండీ ప్రతిరోజూ మంటలే...!!

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
ఆ ఇంట్లో ఆరోజు నుండీ ప్రతిరోజూ మంటలే
Advertisement

ఒక్కోసారి కొన్ని కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరుగుతూంటాయి. అవి మనల్ని ఆందోళన కలిగిస్తాయి. అలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో జరిగింది. ఇటీవలి చంద్రగ్రహణం తర్వాతి నుంచి ఓ ఇంట్లో ప్రతి రోజూ మంటలు అంటుకుంటున్న ఘటన బాధిత కుటుంబ సభ్యులనే కాదు, ఆ ప్రాంతంలోని వారిని కూడా తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. మిస్టరీగా మారిన ఈ ఘటన ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో జరిగింది.

ఈ నెల 8న చంద్రగ్రహణం, భూకంపం సంభవించిన తర్వాత నుంచి ఇంట్లో ప్రతి రోజూ రాత్రి మంటలు అంటుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరుగుతోందేమోనని విద్యుత్ కనెక్షన్ తీయించారు. ఆ తర్వాత కూడా ఇంట్లోని ఎలక్ట్రిక్ బోర్డులు, వైర్లు కాలిపోతుండడంతో వారి భయం మరింత పెరిగింది. అంతేకాదు, విద్యుత్ కనెక్షన్ లేకుండా కూలర్‌ నుంచి మంటలు రావడం, బీరువాలోని దుస్తులు కాలిపోవడంతో భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఉందేమోనని విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి ఎర్తింగ్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement GKSC

స్థానిక మార్కెట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమీపంలో కమల్ పాండేకు రెండంతస్తుల ఇల్లు ఉంది. అందులో కమల్ తమ్ముడు సహా 9 మంది కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. నవంబరు 8న చంద్రగ్రహణం తర్వాత సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంట్లోని విద్యుత్ బోర్డులో మంటలు చెలరేగాయి. దీంతో వాటిని ఆర్పివేశారు. ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి బోర్డు సరిచేయించారు. అయితే, ఆ తర్వాతి రోజు టాయిలెట్‌లోని ఎలక్ట్రిక్ బోర్డులో మంటలు అంటుకున్నాయి. దీంతో ఇక లాభం లేదని విద్యుత్ కనెక్షన్‌ను పూర్తిగా తొలగించారు. అయితే, విచిత్రంగా ఆ తర్వాత కూడా కూలర్‌లో మంటలు చెలరేగాయి. బీరువాలోని దుస్తులకు మంటలు అంటుకున్నాయి. దీంతో భయపడిపోయిన కమల్ కుంటుంబం తమ ఇంటి ముందున్న ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడికి మకాం మార్చారు.

ఇంటి వద్ద కాపలాగా ఇద్దరు సోదరులు ఇంటి వెలుపల నిద్రించేవారు. అయితే, ఆ తర్వాత కూడా మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. విషయం తెలిసిన సిటీ మేజిస్ట్రేట్ రిచా సింగ్ పోలీసులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. మంగళవారం చివరిసారిగా ఆ ఇంట్లో మంటలు చెలరేగాయి. బుధవారం నుంచి మంటలు కనిపించలేదు. ఇంట్లో పదేపదే మంటలు చెలరేగుతుండడం వెనక ఏదైనా కుట్ర దాగి ఉండొచ్చని రిచా సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. విషయం తెలిసిన స్థానికులు ఆ వింతను చూసేందుకు ఎగబడుతున్నారు.

కాలిన వస్తువులను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. భూకంపం కారణంగా భూమి లోపల ఉండే వాయువుల లీకేజీ కారణంగా ఇలా జరుగుతుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, గతంలో రాజస్థాన్‌లోని జలోర్, యూపీలోని కస్గంజ్, ఖుషీ నగర్‌లలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇళ్లలో పలుమార్లు మంటలు చెలరేగాయి. దీంతో బాధిత కుటుంబాలు భయపడి ఇంటిని ఖాళీ చేశాయి. ఆ తర్వాత ఇంట్లో మంటలు వాటంతట అవే ఆగిపోయాయి. ప్రస్తుతానికి మంటలు ఆగిపోయినప్పటికీ కొంతకాలంపాటు వారిని భయం వెంటాడుతుందన్నమాట మాత్రం వాస్తవం.

Advertisement
Author Image