Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 8 మంది మృతి !
Accident : బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైశాలి జిల్లా దేశారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్-మహనార్ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జనసంచారం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ట్రక్కు వేగంగా దూసుకొచ్చి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘోర ప్రమాదంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని సీఎం నితీశ్ అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... అనుకోని రీతిగా ట్రక్కు రోడ్డుదిగి జనంపైకి దూసుకొచ్చి చెట్టును ఢీకొని ఆగిపోయింది. సదరు ప్రాంతంలో వేగ పరిమితి గంటకు 20 నుంచి 30 కి.మీ.గా నిర్ణయించినప్పటికీ ట్రక్కు దాదాపు 60 కి.మీ వేగంతో దూసుకొచ్చిందని సమాచారం. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా వారిలో 6 గురు చిన్నారులే ఉండడం మరింత బాధకు గురిచేస్తుంది. వారు... వర్ష కుమారి(8), సురుచి కుమారి (12), అనుష్క కుమారి (8), శివాని (8), ఖుషీ కుమారి (10), చందన్ కుమార్ (20), కోమల్ కుమారి (10), సతీష్ కుమార్ (17) మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో సురుచి కుమారి (8), అంజలి కుమారి (6), సౌరభ్ కుమార్ (17), మరో 50 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.